
Divine History of Sri Venkateswara : శ్రీ మహావిష్ణువు పై కోపగించిన లక్ష్మీదేవి భూలోకమునకు పోవుట.
భృగుమహాముని భూలోకమున గంగానదీ తీరమున చేరి యచ్చట మహర్షులు యజ్ఞము చేయుచోటికి వెళ్ళెను.
వారికి తన పరీక్షానుభవములు తెలిపెను. త్రిమూర్తులలో సాత్త్వికగుణ ప్రధానుడు శ్రీమహావిష్ణువు మాత్రమేనని వారికి చెప్పి యజ్ఞఫలమును శ్రీమన్నారాయణునికి ధారపోయవలెనని సలహా యిచ్చెను.
మునులందరు సంతసించిరి.
అక్కడ వైకుంఠములో విషయాలెలా వున్నాయంటే, శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలము పై భృగువు తన్నాడు గదా!
అందువల్ల శ్రీమన్నారాయణుని హృదయమే నివాసంగా గల లక్ష్మీదేవికి ఎక్కడలేని కోపమూ వచ్చినది. వచ్చుటయేమి హెచ్చినది. హెచ్చిన కోపముతో నిట్లనినది.
ఎన్నడునూ కోపించని లక్ష్మీదేవి కోపించి శ్రీమన్నారాయణునితో అన్నది గదా-
నాథా! నా హృదయబంధూ! ఏమిటి భృగువునకింత పొగరు? సర్వలోకములకు కర్తలు, శాసనాధికారులు అయిన మిమ్ములను తన్నినందులకు నాకు చాలా విచారముగా నున్నది. Divine History of Sri Venkateswara
అందుననూ మీ హృదయము పై తన్నుట వలన నేను చెప్పరాని బాధ పొందవలసివచ్చినది.
నాథా! ఆ భృగువు గర్వాంధుడయి మీ హృదయము పై తన్నగా, ఆ దుష్టుని మీరు దండించవలసినది కదా! దండించలేదు సరికదా పైగా అతనిపాదములను ఒత్తితిరి. అది ఉత్తమకార్యమా?
నాకది యెంతటి యవమానమును కలిగించినది.
ఆ యధముడైన మునిని నేను సర్వనాశన మొనర్చ గోరుచున్నాను అనెను.
శ్రీమహావిష్ణువు ‘‘నా హృదయేశ్వరీ! లక్ష్మీ! నీవు భక్తులకు నాకు మధ్య గల సంబంధము లెరుంగక ఇట్లు కోపము తెచ్చుకొంటివి.
నా యొక్క భక్తుల మనోభావము లను అర్ధము చేసికొనుట యితరులకు శక్యముకానిది. అది నాకు మాత్రమే అర్దమగును.
భృగువనిన ఎవరన్నుకొన్నావు, అతడు మహాజ్ఞాని, జ్ఞానియగు భక్తుడు నన్నవమానించునా?
అతడీనాడు మహోత్కృష్ట కార్యాన్ని నిర్వర్తించుటకు మాత్రమే వచ్చాడు. ఆ కార్యము నెరవేరుటకు నన్ను తన్నినాడు.
కాని, మరొకటి మరొకటి కాదు. అతని భావమన్న కపిల గోవు వెన్న, అదియుగాక భక్తులు మనకు బిడ్డలవంటివారు.
బిడ్డలు చేయు పనులకు తల్లిదండ్రులు కోపము తెచ్చుకొని వారిని తెలిసికొనక దండించుట తగునా? కనుక ఓ ప్రాణేశ్వరీ! లక్ష్మీ నీవు శాంతమును పొందవలసియున్నది అని అన్నాడు.
మెల్లమెల్లగా చల్లచల్లగా నీతులు గరపాడు లక్ష్మికి. కాని లక్ష్మీదేవి కోపమును ఆయన ఉపశమింపచేయలేక పోయాడు.
రమాదేవి ఒడలు మండిపోయినది, ఆవేశమే తానయి యిట్లన్నది,
‘‘ప్రాణప్రియా! నాథా! భృగువు చేసినది మీకిష్టము కావచ్చును.
నాకు కాదు. నా నివాసమగు మీ హృదయమును తన్ని నన్ను బాధ పెట్టించిన ఉసురు ఊరకనే పోదు. అతడనుభవించియే తీరవలెను. Divine History of Sri Venkateswara
దుర్మార్గుని శిక్షించియే తీరవలెను, లేనిచో మఱింత విజృంభించును. పగ తీర్చుకొనక నేనొక క్షణమేని విశ్రమించలేను.
ఆ భృగువును సమర్ధించిన కారణముగా నేటితో మీకును, నాకు గల సాన్నిహిత్యము బెడిసికొట్టినది.
ఆ బ్రాహ్మణాధముడు మన ఇద్దరును యీ విధముగ వేరుచేసినవాడయ్యెను’’ అని అణుచుకొనలేని కోపముతో బ్రాహ్మణులు భూలోకమున దరిద్రావస్థల ననుభవించెదరు గాక! దారిద్ర్యమును అనుభవించుచు తమకు గల ఉన్నత విద్యలను అమ్ముకొనుచు దుర్భర జీవితములను గడుపుదురుగాక’’ అని శపించివైచెను.

లక్ష్మీదేవి తన భవిష్యత్తును గూర్చి ఆలోచింపసాగినది.
కట్టుకొన్న భర్తయే కాక తనను హృదయములో భద్రముగా దాచుకున్న భర్త అగు శ్రీ మహావిష్ణువుతో స్పర్థ ఏర్పడింది కదా! అయినప్పుడింక తానేమి చేయవలసివున్నది?
అవమాన దగ్ధ హృదయముతో భర్త వద్ద నుండుట కన్న ఎక్కడో ముక్కు మూసుకొని ఒకచోట తపస్సు చేసుకొనడం మంచిదని రమాదేవి యెంచినది.
‘‘నేను మఱి వైంకుఠమును వదలి వెడలిపోతున్నాను.’’ అన్నది లక్ష్మి.
‘‘మనసు మార్చుకొను’’మని నారాయణుడు బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలినా లాభం శూన్యం అయినది.
పట్టుదల వీడలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి బయలుదేరింది భూలోకానికి! పర్వతములు, కొండలు, కోనలూ, గట్లూ, పుట్టలూ, మొక్కలూ, నదులు, నదాలు, సముద్రాలు, జలపాతాలు దాటుకుంటూ ప్రయాణం సాగించినది.
ఎంత అందమయినదీ ప్రకృతి! పచ్చదనాల శోభలు, ప్రకృతి రమణీయ సంపద మున్నగు వానితో తులతూగుచున్నది. హరిత నీలభరిత ధూమ్రవర్ణ కాంతివంతమై వున్నది. రమాదేవి భూలోకమున తన ప్రయాణం సాగించి, సాగించి, గంగతో సమానమైన పుణ్యనదీ అయిన గోదావరి నదీతీరము చేరింది. Divine History of Sri Venkateswara
గోదావరి అందము గోదావరిదే! దాని గమనములోని సొగసుదనము దానిదే! పురాణ ప్రసిద్ధ గోదావరీ నదిని లక్ష్మీదేవి చేరినది.
గోదావరీ తీర స్థలమున కొల్లాపురము వద్ద ఒక చక్కని పర్ణశాలను చేసికొని అచ్చట లక్ష్మీదేవి తపస్సు ప్రారంభించినది.
శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-7
భార్యావియోగపు బాధతో విష్ణుమూర్తి శేషాద్రి ప్రయాణము
లక్ష్మీదేవి విడిచిన వైకుంఠము శ్రీ మహావిష్ణువునకు పాడుపడిన బీడువలెనున్నది. ఒక కళ లేకుండెను. దిగాలుపడి విష్ణుమూర్తి నిరంతరము భార్యను గూర్చి ఆలోచించుచుండెను.
పూవుల ప్రోవువంటి నా లక్ష్మి ఎచ్చటనున్నదో కదా! సుకుమార శరీర లావణ్య శోభితయగు నా రమాదేవి ఎక్కడ ఏ యిడుములబడుచున్నదో గదా? అని శ్రీమన్నారాయణుడు పదే పదే విలపించుచుండెను.
ఇప్పుడాయనకు ఏ భక్తుల ఆర్తనాదములున్నూ వినబడుటలేదు, ఇప్పుడాయన ఏ మునీశ్వరునికి తన దివ్యసుందర విగ్రహ దర్శన భాగ్యము కలుగజేయుటలేదు.
తన తలంపులు లక్ష్మిని గూర్చి తన కన్నులు ఆమెను చూచుటకు నిరీక్షించుచుండెను.
తన చెవులు ఆమె యొక్క ‘నాథా’ అను శుభకర శబ్ద శ్రవణమునకు ఆతృత చెందుచున్నవి. లక్ష్మీదేవి వైకుంఠమున నివసించుకుండుట నారాయణునకు దుర్భరముగానుండెను.
ఓదార్చువారు ఓదార్చుచునే యున్నారు. కానీ లాభము లేకుండెను. ఎప్పుడునూ విచారించని వారొక్కమారు విచారించిన అదిఎంతో చాలా లోతైన బాధ అయి యుండుట సహజము గదా! దానిని ఆపజూపుట విఫలమగు ప్రయత్నము మాత్రమే అగును.
తన నిజసతిని వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుటకై బయలు దేరాడు.
ప్రపంచస్థితికి కారకుడయిన శ్రీమహావిష్ణువు యొక్క ఆ స్థితికి లక్ష్మీదేవి కారకురాలయినది.
మండుటెండలలో మహావర్షధారలలో ఆయన అడవులందు, కొండలందు, కోనలందు, విచార వదనముతో తిరుగసాగెను.
రమాదేవికై విలపించసాగెను. రాత్రియనక, పగలనక కాలగణన మనునది లేక తన నిజసతిని గూర్చి అన్వేషణ సాగించుచునే వుండెను. Divine History of Sri Venkateswara
మతి భ్రమించిన వానివలె తిరుగుచూ వృక్షముల చెంతకు వెడలి ఓ వృక్షములారా! నా ప్రియసతి ఇటు వచ్చుట చూచినారా!’ అనీ, శిలలు వద్దకు వెడలి, ఓ శిలలారా! మీ ప్రక్కల నుండి నా లక్ష్మీదేవి వెడలుట చూచినారా?’ అని అడుగుచుండెను.
ఆకలిలేదు, నిద్రలేదు. విశ్రాంతి అనునది అసలు లేనేలేదు. అన్వేషణ, ప్రయాణమే పని!
రమారమా అని అరచుచూ శుష్కించిన శరీరముతో శేషాద్రికి చేరినాడు.