
Sri venkateswara Divya charitra-4 – కైలాసమున భృగు మహాముని – బ్రహ్మదేవుని పరీక్షించుట జరిగినది.
ఇంక శంకరుని పరీక్షించుట కొరకు సరాసరి కైలాసమునకు బయలు దేరాడు.
ఆ కైలాసమున వెండికొండ పై శివుడు ప్రమధ గణము శివనామ జపధ్యాన మొనర్చుచుండ తన్మయుడై యుండెను.
కైలాసాచలము మీద ఎక్కడ వినిననూ పవిత్ర పంచాక్షరీ మంత్ర ప్రణవ నిస్వసములే! ఎక్కడ చూచినా భక్తతతుల శివభక్తి పారవశ్యమే!
భృగు మహాముని పరమేశ్వరుని ప్రత్యేక మందిరపు దిక్కుగా వెడలినాడు.
అందమయిన ఆ మందిరము చెంతకు వెడలి కావలియున్న వారిని శంకరుడేమి చేయుచున్నాడని అడిగెను.
అప్పడొకండు ఆర్యా! ప్రస్తుత సమయమున శంకరుడు తన నిజసతి పార్వతీదేవితో గూడి ఏకాంతకేళిలోనున్నాడు. ఇప్పట్టున మీకాయన దర్శన మగుట దుర్లభము. Sri venkateswara Divya charitra
కనుక తాము మఱియొకసారి రావలసినది’’ అని వినయముగా చెప్పెను.
‘కాదు నేనిప్పుడే లోనికిపోయి తీరవలెను’ అన్నాడు భృగువు. కూడదని చెప్పి చెప్పి చూచిరి.
కాని, భృగువు మంకుపట్టు వీడలేదు. ఆరుమూడైన మూడు ఆరైనా లోనికి వెడలియే తీరవలెననీ హుంకరించి లోనికి ప్రవేశించినాడు.
కేళీ విలాసముల గరుగుచున్న ఆ యాది దంపతములకు ఆటంటకము కలిగెను.
పార్వతీదేవి పరపురుషుడగు భృగువును చూచినదై సిగ్గుదొంతరలు ముంచుకొనిరాగా ప్రక్కకు తొలగిపోయినది.
శంకరున కెక్కడలేని కోపము వచ్చినది. మహోగ్రమూర్తియై
‘‘ఓయీ భృగువూ! మునివై యుండియు నీకు మర్యాద తెలియకపోవుట ఆశ్చర్యముగానున్నది. ఏకాంతముగా కాంతతో శయ్యాగారమున నుండినప్పుడు ఆ మందిరములలో అన్యులు ప్రవేశించరాదను సామాన్య ధర్మమైననూ నీకు తెలియదా?
అసలు నీవు నా అనుమతి లేనిదే లోనికెందులకు వచ్చితివి?

బ్రహ్మవంశమున పుట్టి మహా తపస్సు ఒనరించిన కీర్తిశాలివగు నీయట్టివాని కిట్టి పాపకృత్యమొనరించుట తగినదగునా?
నీ ముఖమును జూచుటయే శుభకరము కాదు. నిన్ను కనికరించివిడుచుచుంటిని కానీ, లేనిచో నిన్ను నాశనమొనరించుట యెంతపని? Sri venkateswara Divya charitra
ఛీ! వేగముగా బయటకు పొమ్మని దూషించి వదలివైచెను. శివుడు తనను దులిపి దులిపి విడిచినన్నూ భృగువునకు చీమ కుట్టినట్లు కూడ లేకపోయెను.
పైపెచ్చు లోలోపలనవ్వుకొని బైటకు వచ్చివైచెను.
ఈ శంకరుడు గూడ సత్త్వగుణ ప్రధానుడు కాకపోయెను. ఏకాంతమందిరమున ప్రవేశించితినని మండిపడినాడు
దానికి మించి తిట్లవర్షమును కురిపించినాడు.
మహా విరాగియైన యీ శంకరునికి కూడ కోపము వచ్చినదే! దీనికి ఆయనకు గల తామసగుణమే కారణము కదా! అని అనుకొనెను.
తామసగుణ ప్రధానుడగుటచే ఈ శంకరుడు తామసభావమున నేను వచ్చిన పనిని గ్రహించలేకపోయినాడు. అని అనుకొనుచూ భృగుమహర్షి కైలాసమును వీడి వెడలినాడు
శ్రీవేంకటేశ్వర దివ్య చరిత్ర-5
వైకుంఠమున భృగువు శ్రీహరి వక్షస్థలమును తన్నుట
కైలాసమును వీడి ఆ భృగువు ఉత్కంఠతతో వైకుంఠమునకు వెడలినాడు.
బ్రహ్మను పరీక్షించుట జరుగనే జరిగినది. శంకరుని పరీక్షించుట జరిగినది.
శ్రీ మహావిష్ణువును పరీక్షించవలసియున్నది,
అందువలననే భృగువు శోభాయమానమగు వైకుంఠమునకు ప్రయాణమై వైకుంఠమును చేరినాడు.
అచ్చట శ్రీమహావిష్ణువుండెడి సొగసు వెలార్చు సుందర మందిరమును ప్రవేశించినాడు.
ఆహా! ఏమీ ఆ లక్ష్మీనారాయణుల దివ్యస్వరూపములు,
శ్రీమహావిష్ణువు శేషపాన్పు పై ఠీవిగ పవ్వళించుటలో గల ఆ వంపుసొంపు యెంత చక్కగానున్నది!
పవ్వళించియున్న శ్రీమన్నారాయణుని పాదకమలములను లక్ష్మీదేవి తన కర కమలములతో మెల్లమెల్లగ ఒత్తుచున్నది.
హృదయమున భృగుమహర్షి నారాయణ స్మరణ మొన్నర్చినాడు.
తదుపరి ఒక్కసారిగ శ్రీమన్నారాయణుని చెంతకేగి అదరూ బెదురూ లేకుండగ ఆయన పవిత్ర వక్షస్థలమును తన్నినాడు.
శ్రీ మహావిష్ణువు యొక్కవక్షస్థలమును తన్నుట ఎవ్వరునూ, ఎప్పుడునూ చేయ సాహసించని పని, దానిని భృగువు చేసినాడు.
లక్ష్మీదేవి పొందిన ఆశ్చర్యమునకు అంతులేకపోయెను. తనను తన్నినందులకు వైకుంఠవాసుడావంతయు చలించలేదు.
వీసమెత్తయిన కోపమును పొందలేదు. పైగా తన పాన్పు నుండి దిగి వెడలి భృగుమహాముని పాదములను పట్టుకొని
‘మహర్షీ! నేడు నేనెంత ధన్యుడనైతిని, మహాతపశ్శక్తి సంపన్నులగు మీ పవిత్ర పాదధూళి వలన నా శరీరమెంతగానో పవిత్రమైనది. Sri venkateswara Divya charitra
అయ్యో! మరచితిని. కుసుమ సమాన కోమలములైన మీ పాదములు నా శరీరమును స్పృశించు ఎంతగా నొచ్చికొనినవో కదా! స్వామీ! ఏదీ మీ పాదములిటు చూపుడు’’ అనిచూచి కొంత ఒత్తెను,
భృగువునకు పాదమున ఒక కన్ను గలదు. ఆ కంటిని శ్రీమన్నారాయణుడు ఆయన పాదముల నొత్తుచు చిదిపివేసెను.
పిదప భృగుమునితో ఈ విధముగాననెను.
‘‘భృగుమహర్షీ! మీ హృదయమున గల అభిప్రాయమును, మీరు వచ్చిన పనిని నేను గ్రహించనే గ్రహించితిని.
మీరు ఏ పని నిమిత్తము నా కడకు వచ్చిరో ఆ పని అయినందులకు నేను మిక్కిలిగ ఆనందించుచున్నాను.’’
ప్రశాంతమయిన, గంభీరమయిన శ్రీమహా విష్ణువు యొక్క పలుకులు భృగుముని పై అమృతపు చినుకులుగనుండెను.
పాదమున గల కన్నుపోయిన పిదప భృగువున కేదియో నూతనానుభూతి కలిగెను.
శ్రీమహావిష్ణువు యొక్క పరమశాంత స్వభావమునకు భృగువు లోలోపల మహానందమును పొందెను.
ఆహా ఎంతటి సాత్త్వికమూర్తి విష్ణుమూర్తి! అనేక విధములైన శక్తి సంపదలున్నప్పటికినీ, తాను వక్షస్థలమున తన్నినప్పటికినీ కించిత్తూ మాట్లాడకదూషించలేకపోయెను.
పైగా నా యొక్క పాదమున కేమయినా నొచ్చినదేమోనని నొచ్చుకొనుచున్నాడు. కావున శ్రీ మహావిష్ణువు మించిన సత్త్వగుణ ప్రధానుడు మరియొకడు లేడని గుర్తించాడు భృగువు.
శ్రీమహావిష్ణువుతో అతడు, ‘సకలలోకపితా!నీవంటి మహాత్ముని పరీక్షించుటకు అరుదెంచుటయే పాపమునకు కారణమగును. నా పాపము బహుజన్మలెత్తిననూ పోవునా? తీరునా? నా తప్పును క్షమించవలసినదిగానూ, నన్ను రక్షించవలసినదిగానూ కోరుచున్నాను’’ అనెను.
శ్రీమన్నారాయణుడు ముఖము నుండి చిరునవ్వు వెన్నెల కురిపిస్తూ కన్నుల నుండి దయను మెరిపిస్తూ భృగుమహర్షీ! నీ హృదయము నేనెరుంగనిదా!
మీ పరీక్ష వలన మా గొప్పతనము మరియొక మారు ఋజువైనది అంతియే కదా! అందువలన నీకిది పాపదాయకము కాదు, నీకు శుభము కలుగును గాక! Sri venkateswara Divya charitra
నీకు లోకకళ్యాణ కారకత్వము కలుగునుగాక! వెడలిరమ్ము అని కటాక్షించుచూ పలికినాడు.
నారాయణుడు కరుణించగనే భృగువు ‘అమ్మయ్య’ అనుకొని భూలోకమునకు హుటాహుటిగా ప్రయాణమయ్యాడు.